Mega Family : వయనాడ్ కోసం గొప్ప హృదయంతో స్పందించిన మెగా ఫ్యామిలీ

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. పలువురు ఇప్పటికే తమ మద్దతుని తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
'వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయినవారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
వయనాడ్ బాధితులను ఆదుకోవడానికి హీరో అల్లు అర్జున్ కూడా ముందుకు వచ్చారు. తన వంతుగా రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆయన అభిమానులు వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com