Urvashi Rautela : డాకు మహారాజ్ వివాదం.. స్పందించిన ఊర్వశీ రౌతేలా

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ మూవీలోని దబిడి దిబిడి సాంగ్లో స్టెప్పులపై చాలా విమర్శలొచ్చాయి. నటి ఊర్వశీ రౌతేలా ఓ ఇంటర్వ్యూలో వాటి గురించి స్పందించారు. ‘ఆ పాటకు మేం రిహార్సల్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ ఎబ్బెట్టుగా అనిపించలేదు. బాలయ్య అభిమానుల్ని అలరించేందుకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ అలా డిజైన్ చేశారు. కానీ రిలీజయ్యాక జనంలో అంత విమర్శలు వస్తాయని మేం ఊహించలేదు’ అని వెల్లడించారు. సోషల్మీడియాలో కొందరు కావాలని విమర్శలు చేస్తుంటారని, అలాంటి వాటిని పట్టించుకోనని ఊర్వశీ స్పష్టం చేశారు. అయితే, నిర్మాణాత్మక విమర్శలను మాత్రం స్వాగతిస్తానని అన్నారు.
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ దేవోల్ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశీ రౌతేలా అతిథి పాత్ర పోషించారు. తమన్ స్వరాలు అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇది నిర్మితమైంది. సుమారు రూ.100 కోట్లకు పైగా ఇది వసూలు చేసినట్లు అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com