Repalle Gang Rape: రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్.. భర్తను తీవ్రంగా కొట్టి..
Repalle Gang Rape: ఏపీలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. రేపల్లె రైల్వే స్టేషన్లో ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను కొట్టి భార్యను లాక్కెళ్లిన మృగాళ్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూలీ పనుల కోసం బాధితురాలి కుటుంబం ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్తున్నారు. రాత్రి రేపల్లె స్టేషన్లో రైలు దిగిన తరువాత.. ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మహిళను ఫ్లాట్ఫామ్ చివరకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
అడ్డుపడిన భర్తను తీవ్రంగా కొట్టారు. తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని, అడ్డొచ్చిన భర్తను కొట్టారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. ఆ మహిళలను హాస్పిటల్కు తరలించారు. అయితే, బాధితురాలి భర్త, పిల్లలు మీడియాతో మాట్లాడకుండా పోలీసులు ఓ రూమ్లో పెట్టారు. అటు.. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రేపల్లె రైల్వేస్టేషన్లో గ్యాంగ్రేప్ ఘటనకు రైల్వే శాఖదే బాధ్యత అన్నారు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఘటనపై రైల్వే శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చామని, మహిళా కమిషన్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని అన్నారు. రేపల్లె అత్యాచార ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com