Guntur: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం.. రైతు ఆత్మహత్య..

Guntur: రెవెన్యూ అధికారుల తీరుతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిన్న తన పొలం మీదుగా చెరువు నీటి మళ్లింపును అడ్డుకున్నాడు నందకిషోర్. కాల్వకు నీరు వదిలడం కోసం తన పొలానికి ఉన్న కట్ట ఎలా తొలగిస్తారని అధికారుల్ని నిలదీశాడు. తన పొలం ముంపునకు గురవ్వకుండా ఏర్పాటు చేసుకున్న కట్టను తొలగించడానికి వీల్లేదని అడ్డుకున్నాడు.
ఐతే.. అధికారులు, పోలీసులు నందకిషోర్ చెప్తున్న వాదనను పట్టించుకోలేదు. జేసీబీ సాయంతో కట్టను తొలగించారు. ఈ పరిణామంతో నందకిషోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నిస్సహాయ స్థితిలో, తనకు న్యాయం జరగడం లేదనే వేదనతో పోలీసుల ముందే పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఐతే.. ఇవాళ పరిస్థితి విషమించడంతో రైతు ప్రాణాలు వదిలాడు.
తన పొలం ముంపునకు గురికాకుండా వేసుకున్న కట్టను.. రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నా ఆపలేకపోయాననే బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం ఉంగుటూరులో విషాదాన్ని నింపింది. ఈ రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ విపక్షాల ఆందోళనకు దిగాయి. గుంటూరు ఆస్పత్రి వద్దకు బంధువులు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకుంటుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారంతా ఆందోళనకు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com