అతని కథ అర్ధాంతరంగా ముగిసింది
![అతని కథ అర్ధాంతరంగా ముగిసింది అతని కథ అర్ధాంతరంగా ముగిసింది](https://www.tv5news.in/h-upload/2023/06/18/994043-lkjl.webp)
అయన ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. వాటిని వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన కథ అర్ధాంతరంగా ముగిసింది. ఆయన జీవిత నావ విషాదంగా ముగిసింది.
కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ సినిమాల్లో కథలు రాయడంపై ఇష్టంతో చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ వచ్చాడు. షేక్ పేట్ లో ఓ పెంట్ హౌస్లో రెంట్కు ఉంటూ సినిమాల్లో ట్రై చేస్తున్నాడు. సినిమా కథలతో పాటు అసిస్టెంట్ డైరక్టర్గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఏం జరిగిందో కానీ నిన్న తెల్లవారు జామున టెర్రస్పై విగత జీవిగా మారాడు
కీర్తి సాగర్ చనిపోయిన విషయం గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు వైద్య సిబ్బంది. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కీర్తీ సాగర్ ఆ బాధతోనే చని పోయినట్లు స్నేహితులు అంటున్నారు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందల సినిమా కథలు గది నిండా ఉన్నాయి.వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com