ARREST: బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుల అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో బీటెక్ విద్యార్థిని అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిపై అత్యాచారం చేసి, నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ తెలిపారు. ప్రధాన నిందితుడితోపాటు అతని మిత్రులను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే..?
తిరువూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ చదువుతూ హాస్టల్లో ఉంటోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. గత నెల 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో షేక్ హుస్సేన్ మిత్రులు షేక్ గాలి సైదా, చింతల ప్రభుదాస్ కూడా ఉన్నారు. యువతి చదివే కళాశాలలోనే ప్రభుదాస్ కూడా ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ఫంక్షన్ జరగడంలేదని యువతి నిలదీయగా.. నీతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచానంటూ హుస్సేన్ నమ్మబలికాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అతను బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదా గది లోపలకు వచ్చి, హుస్సేన్తో దిగిన ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని బయటపెడతానంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. యువతి అరుపులు వినిపించకుండా టీవీ పెద్ద సౌండ్తో పెట్టారు. ఇంటి బయట హుస్సేన్, ప్రభుదాస్లు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారానికి పాల్పడిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాధితురాలిని ముగ్గురూ బెదిరించారు. తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్, ప్రభుదాస్లు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ముగ్గురి వేధింపులు తాళలేక యువతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com