Eluru District : యజమాని ఇంట్లోనే చోరీ.. నిందితుడు అరెస్ట్

జూదాలకు బానిసైన ఓ వ్యక్తి తాను పనిచేసే యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరకు ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.23.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. గణపవరం గ్రామానికి చెందిన సరిపల్లి రాజు అలియాస్ వెంకటరాజు అనే వ్యక్తి చిలువూరి వెంకట రామరాజు అలి యాస్ వెంకన్నబాబు చెరువుపై పనిచేస్తున్నాడు. సరిపల్లి రాజు పేకాట, క్రికెట్ బెట్టింగ్, మద్యం వంటి దురలవాట్లకు బానిసై యజమాని ఇంట్లోనే చోరీ చేసేందుకు స్కెచ్ వేశాడు. యజమాని రామరాజు మే నెలలో హైదరాబాద్ వెళ్లడంతో సరిపల్లి రాజు ఈ నెల మొదటివారంలో రాత్రిపూట యజమాని ఇంటి వెనుక తలుపులు పగులుకొట్టి లోనికి ప్రవేశించి చెక్క బీరు వాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకు పోయాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు గణపవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను భీమవరంలో విక్రయించేందుకు వెళ్తుండగా ఈనెల 10న సరిపల్లి గ్రామం సీపీఎఫ్ ఫ్యాక్టరీ వద్ద నిందితుడు సరిపల్లి రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ సొత్తు 33 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com