TTD : తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మూడురోజుల పాటు స్వామి వారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990లో ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
సామాన్య భక్తులకు త్వరిత గతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ( TTD ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com