Jagannath Rath Yatra: కన్నుల పండువగా పూరి జగన్నాథుడి రథయాత్ర..

Jagannath Rath Yatra: కన్నుల పండువగా పూరి జగన్నాథుడి రథయాత్ర..
Jagannath Rath Yatra: ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరుగుతోంది.

Jagannath Rath Yatra: ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో... జనసంద్రంగా మారింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌... ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుడి రథం ముందుకు కదిలింది. ఎలాంటి తోపులాట జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకున్నారు. నందిఘోష్ రథంలో జగన్నాథుడు, తాళధ్వజలో బలభద్రుడు, దర్పదళన్‌లో సుభద్ర బయలుదేరారు. కరోనా కారణంగా గత రెండేళ్లు భక్తులు లేకుండానే రథయాత్ర నిర్వహించారు. ఈ సారి భక్తులకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచి పూరి భక్త జన సంద్రంగా మారింది.

రథయాత్ర నేపథ్యంలో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే 205 స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. పూరిలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. తొక్కిసలాట జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పూరిని నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని అధికారులు ఎయిర్‌పోర్టు యంత్రాంగాన్ని కోరారు. రథయాత్ర పురస్కరించుకుని ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story