నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించిన పోల్రైట్స్ గ్రూప్ ఏడీఆర్

చట్టసభల్లో నేరచరితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాజకీయాల్లోకి నేర చరిత్ర ఉన్న నాయకుల ఎంట్రీ ప్రతి ఏటా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ౩౩ శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు క్రైం హిస్టరీ ఉందని ఏడీఆర్ ప్రకటించింది. కోటీశ్వరులకూ కొదవ లేదని పేర్కొంది.
తమిళనాడులో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 68 మంది అంటే 33 శాతం నేరచరిత్ర కలిగినవారే ననే పోల్రైట్స్ గ్రూప్ ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఆయా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 38 మంది అంటే 19 శాతం పై నాన్ బెయిలబుల్, ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఆస్కారమున్న క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో ప్రతిపక్ష డీఎంకేకు చెందినవారు 40 మంది ఉంటే.. అధికార అన్నాడీఎంకేలో 23 మంది ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మరోవైపు, డీఎంకేలో 22 మంది, అన్నాడీఎంకేలో 13 మంది, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక, ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసులు, మహిళలపై నేరానికి పాల్పడ్డారంటూ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. తమళనాడులో కోటీశ్వరులకు కూడా కొదవలేదు.. 157 మంది అంటే 77 శాతం మంది సిటింగ్ ఎమ్మెల్యేలు కోటీశ్వరులని నివేదిక చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com