దేశంలో కొత్తగా 3,44,949 కేసులు, 2,620 మంది మృతి..!

దేశంలో కొత్తగా 3,44,949 కేసులు, 2,620 మంది మృతి..!
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉన్న అమెరికాను వరుసగా మూడవ రోజు కూడా వెనక్కి నెట్టివేసింది.

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉన్న అమెరికాను వరుసగా మూడవ రోజు కూడా వెనక్కి నెట్టివేసింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 3 లక్షల 44 వేల 949 కేసులు నమోదు కాగా.. 2వేల 620 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కేసుల సంఖ్య కోటి 66 లక్షల 02 వేల 456కి చేరాయి. మరోవైపు మొత్తం మరణాల సంఖ్య లక్ష 89 వేల 549కి చేరాయి. ప్రస్తుతం 25 లక్షల 43 వేల 914 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కోటి 38 లక్షల 62 వేల 119 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 13 కోట్ల 54 లక్షల మందికి పైగా టీకాలు అందించారు.

దేశంలో ఆక్సిజన్, యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనిపై స్పందించిన రష్యా.. భారత్‌కు ఈ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. వారానికి 3 నుంచి 4 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, అలాగే నౌక ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని రష్యా ముందుకొచ్చినట్టు ఎకనమిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత కనిపిస్తుండటంతో రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో సామాజిక కార్యకర్త ఒకరు బ్రీతింగ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. బ్లాడ్ బ్యాంకు తరహాలో బ్రీత్ బ్యాంకు ఏర్పాటు కానుండటం దేశంలో ఇదే తొలిసారి కానుంది. ఇంతవరకూ 95 మిషన్ల కొనుగోలుకు ప్రజలు విరాళాలివ్వగా.. 500 మిషన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 10 మిషన్లు ఇప్పటికే జోథ్‌పూర్ చేసుకున్నాయి.

ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతాన్నీ కరోనా మహమ్మారి వదలండం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా కరోనా తాకింది. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో ఉంటున్నఒక పర్వతారోహకుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతనిని హెలికాప్టర్ ద్వారా ఖాట్మాండులోని ఒక ఆసుపత్రికి తరలించారు. నెస్ అనే పర్వతారోహకుడు తనకు కరోనా సోకిన విషయాన్ని మీడియాకు తెలిపాడు. చికిత్స తీసుకున్న అనంతరం తాజాగా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, ప్రస్తుతం నేపాల్‌లో ఉంటున్నట్లు తెలిపాడు.

ఇక హెపటైటిస్‌ చికిత్సలో ఉపయోగించే విరాఫిన్‌ ఔషధాన్ని కొవిడ్‌ చికిత్సలో వినియోగించేందుకు జైడస్‌ క్యాడిలా సంస్థకు అనుమతి లభించింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసరం వాడకం కోసం దీనిని ఆమోదించిందని ఒక ప్రకటనలో తెలిపింది. హెపటైటిస్‌ బి, సి రోగుల్లో చికిత్సకు విరాఫిన్‌ను చాలాకాలంగా వినియోగిస్తున్నారు. ఒక డోసు వాడకంతోనే కరోనా రోగులకు చాలా ఉపశమనం లభిస్తుందని, త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుందని జైడస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story