దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు, 3,698 మరణాలు

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కొవిడ్ కేసులు 4లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 3 లక్షల 86వేల 452 కేసులు నమోదయ్యాయి. 3వేల 698 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షల 8వేల 330కి చేరింది. దేశంలో ఇప్పటికీ 31 లక్షల 70వేల 228 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 15 కోట్ల 20వేల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు వేశారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న మార్గదర్శకాల గడువును పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన అన్ని నిబంధనలు మే 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని తెలిపింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాలు లేదా ఆసుపత్రుల్లో 60 శాతం కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా జిల్లాల్లో కఠిన కంటైన్మెంట్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద చేపట్టాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com