దేశంలో గడిచిన 24 గంటల్లో 4 లక్షలకు పైగా కరోనా కేసులు..!

కరోనా మహోగ్రరూపం దాల్చింది. రోజువారి పాజిటివ్ కేసులలో మరో సరికొత్త రికార్డు సృష్టించింది. గడచిన 24 గంటల్లో ఏకంగా 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మే నెలలో కరోనా మహమ్మారి మారణహోమం సృష్టిస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. దానికి తగ్గట్టే.. మే ఒకటో తేదీనే 4 లక్షల బెంచ్మార్క్ను దాటింది. నిన్న ఒక్క రోజే 4 లక్షల ఒకవేయి 993 మందికి కరోనా సోకింది. గత తొమ్మిది రోజులుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఇక నుంచి రోజుకు 4 లక్షలకు పైగా నమోదవడం ఖాయం అంటున్నారు. నిన్నటి లెక్కలతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక కోటి 91 లక్షల 57వేల 94కి చేరింది.
అటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 3వేల 523 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా రెండు లక్షల 11వేల 835 మందిని మహమ్మారి బలితీసుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 32 లక్షల 63 వేల 966గా ఉంది.
లాక్డౌన్ పెట్టి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. మహారాష్ట్రలో మాత్రం వైరస్ ఉధృతిని కంట్రోల్లోకి తేలేకపోతున్నారు. నిన్న కూడా 63వేల కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో సైతం కరోనాను లాక్డౌన్ అడ్డుకోలేకపోతోంది. దేశంలోనే రెండో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. కర్నాటకలో నిన్న 48వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 37వేల కేసులు, ఉత్తర ప్రదేశ్లో 34వేల కేసులు, ఢిల్లీలో 27వేల కేసులు, తమిళనాడులో 18వేలకుపైగా కేసులు బయటపడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com