Omicron India: ఇండియాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్.. నైట్ కర్ఫ్యూ ఆలోచనలో కేంద్రం..

Night curfew (tv5news.in)
Omicron India: దేశంలో ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూలు పెట్టాలని రాష్ట్రాలని కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, ఈ జిల్లాలపై దృష్టి పెట్టాలని లేఖలో పేర్కొంది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మిగతా 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్లు లేఖలో పేర్కొంది.
పాజిటివిటీ రేటు పెరిగినట్లు కన్పిస్తే.. వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని.. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలి. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని లేఖలో పేర్కొంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com