Climate Change: హిమ ఉత్పాతం... 50లక్షల ప్రాణాలకు ముప్పే...!

2022లో సంభవించిన హిమ ఉత్పాతం, వరదల రూపంలో భారత్ లోని కొన్ని ప్రాంతాలతో పాటూ పాకిస్థాన్ లో అత్యధిక భాగాన్ని నీట ముంచిన వైనం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని న్యూకాసల్ విశ్వవిద్యాలయం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1089 హిమ నదిజలాలపై పరిశోధన చేసిన విశ్వవిద్యాలయ బృందం గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉందని చెబుతోంది. ముఖ్యంగా పర్వతప్రాంతాలు ఎక్కువగా ఉండే ఆసియా ప్రాంతాల్లో హిమ ఉత్పాతం వల్ల వరదలు సంభవించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. టిబిట్, క్రైగిస్థాన్, చైనా, భారత్, పాకిస్థాన్ లో ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పరిశోధన నివేదిక చెబుతోంది. ముఖ్యంగా భారత్, పాక్ లో అత్యధికంగా 50లక్షల మంది ప్రాణాలకు ప్రమాదముందని హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ఈ వరదలు బారిన పడే అవాకాశం ఉందని తెలుస్తోంది.
భారీ వాతావరణ మార్పుల వల్ల హిమగిరులు కరిగి వాటి చెంత హిమనదిల్లోకి భారీగా నీరు చేరుతోందని పరిశోధన ద్వారా వెల్లడైంది. అలా హిమనదుల్లోకి చేరిన నీరు ఒక్కసారిగా దిగువకు వరదలా పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. హిమ ఉత్పాతం సంభవించిన ప్రాంతం నుంచి 120కి.మి. వరకూ దీని ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు అది అత్యంత వినాశకారంగానూ మారే అవకాశముంది. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా దిగువ ప్రాంత జనాభాతో పాటూ హిమ నదుల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com