దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజూ 18 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే వైరస్ బారిన పడిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. 24 గంటల్లో 18వేల 711 మందికి కొవిడ్ సోకగా.. మరో 100 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో రెండోరోజూ 10వేలకు పైగానే రోజువారీ కేసులు రావడం ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య కోటి 12 లక్షల 10వేల 799కి, మరణాల సంఖ్య లక్షా 57వేల 756కు పెరిగింది. రోజువారీ కేసులు ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. కొత్త కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే 84.71 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
మహారాష్ట్రలో వైరస్ విజృంభణతో మరోసారి పూర్తి లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబయితో పాటు పలు నగరాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అమరావతి, ఔరంగాబాద్, జల్నా, యావత్మల్, పూణె, అకోలా జిల్లాలలో విధించిన పాక్షిక లాక్డౌన్నూ పొడిగించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కఠిన లాక్డౌన్ తప్పకపోవచ్చనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com