ఆలయ పూజారి.. అంత్యక్రియలకు డబ్బుల్లేవని అమ్మ శవాన్ని..
కష్టమో.. సుఖమో.. కనిపెంచింది.. పెద్దవాడ్ని చేసింది. విద్యాబుద్దులు నేర్పించింది. కొడుకు తన కాళ్ల మీద తాను బ్రతికే ధైర్యాన్ని ఇచ్చింది. వృద్ధాప్యంలో కొడుకు ఆదరణకు నోచుకోలేకపోయింది. పట్టెడన్నం కరువై పరలోకానికి వెళ్లిన తల్లికి అంత్యక్రియలకు డబ్బుల్లేవని ఆమె శవాన్ని చెత్త కుండీలో పడేసి చేతులు దులుపుకున్నాడు చెట్టంత ఎదిగిన కొడుకు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. మనుషుల్లో మానవత్వం నశించిపోతుందనడానికి నిదర్శనంగా మారింది.
తూత్తుకుడి జిల్లా ధనసింగ్ నగర్కు చెందిన ముత్తులక్ష్మణన్ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన తల్లి వసంతి మృతదేహాన్ని చెత్త కుండీలో చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. వయోభారం కారణంగా తల్లి మృతి చెందిందని పోలీసుల విచారణలో ముత్తులక్ష్మన్ తెలిపారు. అమ్మకు దహన సంస్కారాలు చేయడానికి తన దగ్గర డబ్బు లేదని అందుకే ఆమె శవాన్ని చెత్త కుండీలో పడేశానని ముత్తులక్ష్మన్ పోలీసులకు వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com