Sindhutai sapkal: 'అనాథ పిల్లల అమ్మ' సింధుతాయ్‌ సప్కాల్‌ ఇక లేరు

Sindhutai sapkal: అనాథ పిల్లల అమ్మ సింధుతాయ్‌ సప్కాల్‌ ఇక లేరు
Sindhutai sapkal: సోషల్ వర్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధుతాయి సప్కల్ ఇక లేరు.. 74 ఏళ్ల ఆమె గుండెపోటుతో మహారాష్ట్రలోని పూణేలో మరణించారు.

Sindhutai sapkal: సోషల్ వర్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధుతాయి సప్కల్ ఇక లేరు.. 74 ఏళ్ల ఆమె గుండెపోటుతో మహారాష్ట్రలోని పూణేలో మరణించారు. ఆమెకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో నవంబర్ 14, 1948లో జన్మించారు సప్కల్. 12 ఏళ్ల వయస్సులో ఆమెకు 32 ఏళ్లున్న వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత.. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు.

ఒకానొక సమయంలో.. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు తన సొంత తల్లి మరియు ఆమె పెరిగిన గ్రామం ఆమెకు సహాయం చేయడానికి నిరాకరించింది.. దీనితో సప్కల్ తన కుమార్తెలను పెంచడానికి యాచక వృత్తిని ఆశ్రయించవలసి వచ్చింది. ఈ పరిస్థితులను అధిగమించి అమె అనాథల సంక్షేమానికి కృషి చేయడం ప్రారంభించింది. ఏకంగా 1400 మంది అనాధ పిల్లలను చేరదీసి వారి ఆలనాపాలన చూసుకుంది. ఇందులో చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. సింధుతాయ్‌ మృతి పట్ల దేశ ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

''సమాజానికి చేసిన సేవలతో సింధుతాయ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె కృషితో చాలా మంది పిల్లలు ప్రస్తుతం ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నారు. అట్టడుగు వర్గాల కోసం సైతం ఆమె కృషిచేశారు. సింధుతాయ్‌ మృతి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు.

వేలాది మంది పిల్లలను పోషించిన సప్కల్ తల్లి రూపంలో ఉన్న దేవత అని అన్నారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.. కాగా ఆమె జీవిత క‌థ ఆధారంగా 2010లో మరాఠీలో "మి సింధుతాయ్‌ సప్కాల్‌ బోల్టే" అనే పేరుతో బయోపిక్ వ‌చ్చంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి స‌త్కరించింది.

Tags

Read MoreRead Less
Next Story