చిన్నమ్మ మిడిల్‌ డ్రాప్‌.. కారణం ఇదేనా?

చిన్నమ్మ మిడిల్‌ డ్రాప్‌.. కారణం ఇదేనా?
జైలు నుంచి వచ్చేశారు.. ఇక తమిళనాట దబిడి దిబిడే అనుకుంటే.. చిన్నమ్మ మిడిల్‌ డ్రాప్‌ అయ్యారు.

జైలు నుంచి వచ్చేశారు.. ఇక తమిళనాట దబిడి దిబిడే అనుకుంటే.. చిన్నమ్మ మిడిల్‌ డ్రాప్‌ అయ్యారు. అవును.. జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాలు వదిలేశారు. ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇంతకీ చిన్నమ్మ రాజకీయాల్ని ఎందుకు విరమించుకున్నట్లు..? అన్ని దారులు మూసుకుపోవడమే కారణమా.. లేక తెరవెనుక ఇంకేమైనా జరిగిందా?

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, డీఎంకేను ఓడించాలని చిన్నమ్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

జయలలిత బతికి ఉన్నప్పుడు కూడా తానెప్పుడూ అధికారంలో లేనని.. ఆమె మరణానంతరం కూడా ఆ పనిచేయలేదని శశికళ పేర్కొన్నారు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని... కానీ జయ పార్టీ గెలవాలని, వారసత్వం కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకే మద్దతుదారులంతా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను ఓడించేందుకు కలిసి పనిచేయాలని.. జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయాలని పార్టీ క్యాడర్‌ను కోరారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్నారు. జనవరిలో విడుదలై తమిళనాడులో అడుగుపెట్టారు. వాస్తవానికి ఆమె జైలు నుంచి రావడంతోటే రాజకీయాలు వేడెక్కాయి. అప్పటిదాకా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వర్సెస్ డీఎంకే- కాంగ్రెస్ కూటమి అనుకున్న పోటీ కాస్తా ఆమె రాకతో త్రిముఖ పోటీ తప్పదన్నట్లుగా కథనాలొచ్చాయి. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి రావాలని కొందరు, వద్దని మరికొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. ఐతే.. ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో ఆరేళ్లు నిషేధం ఉండటంతో ఆమె ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ కొనసాగింది. పైగా తనని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి తన సీఎం కోరికకు అడ్డుతగిలిన పళనిస్వామి, పన్నీర్‌ సెల్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? తన మేనల్లుడు దినకరన్‌ స్థాపించిన కొత్త పార్టీలోకి వెళ్తారోనన్న చర్చ కూడా జరిగింది. అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు కోసం, తన పదవి కోసం కూడా ఆమె పోరాటం చేశారు. ఈసీకి, కోర్టులో ఫిర్యాదు చేశారు కూడా. ఈ పరిణామాలు అన్నాడీఎంకే- బీజేపీ కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని అంచనా వేశారు. డీఎంకేను ఢీ కొట్టాలంటే అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో ఐక్యత తప్పనిసరని కమలనాథులతో పాటు అన్నాడీఎంకేలో సీనియర్ నేతలు నిర్ణయించారు. దీంతో ఏం జరిగిందో ఏమో శశికళ ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకున్నారు. రాజకీయాలనుంచే పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

మొత్తానికి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. శశికళ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story