Uttarakhand Bus Accident: లోయలో పడ్డ బస్సు.. 13 మంది ప్రాణాలను తీసేసింది..
Uttarakhand Bus Accident: రోడ్డు ప్రమాదాలు అనేవి రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. బయటకు వెళ్లిన మనిషికి తిరిగి సేఫ్గా ఇంటికి వస్తారో రారో అని ప్రతిక్షణం భయపడే పరిస్థితి ఏర్పడింది. వార్తల్లో రోజుకు ఒక్క రోడ్డు ప్రమాదం గురించి అయినా మనం వింటూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఒక రోడ్డు ప్రమాదమే ఉత్తరాఖండ్లో జరిగింది. ఈ ప్రమాదం ఏకంగా 13 మంది ప్రాణాలను బలిదీసుకుంది.
ఘాటు రోడ్డులో ప్రయాణం అత్యంత ప్రమాదకరం. ఆ రోడ్లు చూస్తుంటేనే భయమేస్తూ ఉంటుంది. అలాంటి చోట్లలో ఎప్పుడైనా, ఏ ప్రమాదమైనా జరగొచ్చు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు ఏ కొండచరియలు విరిగిపడతాయో అని భయపడుతూ ఉండాలి. తాజాగా ఆ రోడ్డులో ఓ బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది.
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్రాటా అనే ప్రాంతంలో బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బైల గ్రామం నుంచి వికాస్నగర్లోని చక్రాటాకు వెళ్తున్న బస్సు అది. దారిలోని ఓ మలుపు వద్ద అది అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ప్రమాద ప్రాంతం లోతుగా ఉండటంతో సహయక చర్యలకు ఇబ్బందిగా మారింది. బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సహయక చర్యలకు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com