Ukraine Russia: బెలారస్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలం..
Ukraine Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి.. బెలారస్ వేదికగా జరిగిన చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి.. ఉక్రెయిన్ ప్రధాన డిమాండ్లకు రష్యా ఒప్పుకోలేదు.. కాల్పుల విరమణతోపాటు బలగాల ఉపసంహరణకు రష్యా ససేమిరా అన్నది.. క్రిమియా ద్వీపం నుంచి బలగాలు తరలించాల్సిందేనని తన డిమాండ్ను చర్చల సందర్భంగా ఉక్రెయిన్ గట్టిగానే వినిపించింది..
అయితే, నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా చెప్పాల్సిందేనని రష్యా డిమాండ్ చేస్తోంది.. మూడు గంటలుగా చర్చించినా రెండు దేశాలు పంతం వీడకపోవడంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.. చర్చలు విఫలమైన నేపథ్యంలో వచ్చే 24 గంటలు ఉక్రెయిన్కు కీలకమని ఆదేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నారు.. చర్చలు ఫలిస్తాయని అనుకోవడం లేదని మీటింగ్కు ముందే ఆయన చెప్పారు..
అయితే, దేశం కోసం అధ్యక్షుడిగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. ఇక ఐదో రోజు కూడా ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగాయి.. ఇటు చర్చలు జరుగుతున్న సమయంలోనే అటు రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు వేగంగా సాగుతున్నాయి.. మూడు మైళ్ల పొడవైన రష్యా కాన్వాయ్ కీవ్ వైపు వెళ్తున్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి..
ఇప్పటికే యూరోపియన్ దేశాలన్నీ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడంతోపాటు రష్యా విమానాలపై బ్యాన్ విధించాయి.. దీంతో రష్యా కూడా ఆ దేశాలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.. బ్రిటన్, జర్మనీ సహా 36 దేశాల విమానాల్ని రద్దు చేసింది. అటు ఈ విమానాల రద్దు కారణంగా జనీవాలో జరుగుతున్న యూఎన్ సమావేశానికి రష్యా విదేశాంగ శాఖ మంత్రి హాజరుకాలేకపోయారు. యూఎన్లో తమ వాదన వినిపించాలని భావించిన రష్యాకు ఆ అవకాశం లేకుండా పోయింది
అటు, పశ్చిమ దేశాల్ని అసత్యాల సామ్రాజ్యంగా అభివర్ణించారు పుతిన్. ఈ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో రూబెల్ పనతం అవుతున్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అటు, 24 గంటల్లో 3వ సారి మన ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్లో పరిస్థితులు, భారతీయుల తరలింపు, భద్రతపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు.
ఉక్రెయన్ సరిహద్దు దేశాలకు నలుగురు మంత్రుల్ని పంపి.. అక్కడి నుంచే రెస్క్యూ ఆపరేషన్ మొత్తం పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో మాల్డోవా సరిహద్దు నుంచి భారతీయుల తరలింపు బాధ్యత సింధియా చూస్తున్నారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్ మీదుగా ప్రత్యేక విమానాలు భారత్ చేరుకోనున్నాయి. హర్దీప్ సింగ్ పూరీ కూడా దూతగా వెళ్లారు. ఆయన హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి కోర్డినేట్ చేస్తారు.
VK సింగ్ పోలెండ్ నుంచి, కిరణ్ రిజుజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా నుంచి భారతీయుల తరలింపును స్వయంగా సమన్వయం చేసుకుంటారు. వీరంతా ఆయా దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యల బాధ్యతల్ని చూస్తారు. ఇప్పటికి 6 ఫ్లైట్లలో భారత్కి 1396 మంది చేరుకున్నారు. ఇంకా ఉక్రెయిన్లో 8 వేల మంది మంది భారతీయులు ఉన్నట్టు విదేశాంగ శాఖ చెప్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com