సెప్టెంబరులో భారత్కు రానున్న జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రతినిధి డొనాల్డ్ లూ వెల్లడించారు. భారత్, అమెరికాల బంధానికి 2023 గొప్ప ఏడాది కానుందని పేర్కొన్నారు. సెప్టెంబరులో భారత్లో పర్యటించేందుకు అధ్యక్షుడు బైడెన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలిపారాయన. క్వాడ్ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. జీ-20కి భారత్ నాయకత్వం వహించడం ప్రపంచ శ్రేయస్సుకు మరింత శక్తినిస్తుందని తెలిపారు. జీ-20 సదస్సు లో భాగంగా బైడెన్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు అమెరికా మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, జానెత్ యెల్లెన్, గినా రైమోండో కూడా భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబరులో ఢిల్లీలో జరిగే భారత్-అమెరికా ఫోరమ్లో మంత్రులతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com