దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ది కేరళ స్టోరీ

ది కేరళ స్టోరీ చిత్రం.. దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమాపై నిషేధం విధించాలని కేరళ, తమిళనాడులో నిరసనలు మిన్నంటాయి. డైరెక్టర్, నిర్మాతకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. దాంతో థియేటర్లు, మల్టీప్లెక్స్ల ముందు భారీ భద్రతను పెంచారు. ఈ సినిమాను కొంతమంది వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు మద్ధతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్, చిత్ర బృందంలోని ఇతరులకి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది.
ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లకండి..ఈ చిత్రాన్ని ప్రదర్శించి మంచి పనులు చేయలేరంటూ ఆగంతకుడు బెదిరించాడు. దీంతో సుదీప్తో సేన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే చిత్రబృందానికి భద్రత కల్పించారు.
కేరళ స్టోరీ సినిమా విడుదలను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు చిత్ర ప్రదర్శనను నిషేధిస్తున్నాయి. కానీ ఉత్తర్ ప్రదేశ్ మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ వేదికగా తెలిపారు. అంతకుముందు మధ్యప్రదేశ్ కూడా ఈ చిత్రానికి మినహాయింపునిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ది కేరళ స్టోరీ సినిమాను నిషేధం విధించింది.
రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ మంటలు రేపుతున్నా.. ది కేరళ స్టోరీ చిత్రం మాత్రం వసూళ్లలో బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. రిలీజ్ అయిన థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com