Encounter: మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కాల్పుల మోత

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ సతీశ్ పాటిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్ కౌంటర్ లో హతులైన మావోయిస్టుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మధ్యాహ్నం 7 సీ60 కమాండో దళాలు వందోలి గ్రామం వద్ద నక్సల్స్ సమావేశం అయ్యారన్న సమాచారంతో కూంబింగ్ కు బయల్దేరాయి. ఈ సందర్భంగా సీ60 కమాండో బలగాలకు, మావోయిస్టులకు మధ్య దాదాపు ఆరు గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. కాగా, మృతి చెందిన వారిలో సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్టు గుర్తించారు.
కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు ఏకే-47లు, రెండు ఇన్సాస్లు, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్, ఇతర వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగఢ్ దళానికి చెందిన డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం, విశాల్ ఆత్రం ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్ గురించి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గడ్చిరోలి పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తనకు ఎస్పీ, ఐజీలు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని చెప్పారు. గడ్చిరోలి పోలీసులను అభినందించారు. వారికి 51 లక్షల రివార్డును ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com