Bihar Crime: బీహార్లో 13 ఏళ్ల బాలుడి చేతిలో 9 ఏళ్ల బాలిక దారుణ హత్య

బీహార్లో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తన డ్రగ్స్ అలవాటు గురించి ఇంట్లో ఫిర్యాదు చేసిందన్న కోపంతో 13 ఏళ్ల బాలుడు 9 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మత్తుకు బానిసైన ఓ బాలుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడైన 13 ఏళ్ల బాలుడు కొంతకాలంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని గమనించి బాలుడి సంరక్షకులకు తెలియజేసింది. దీంతో వారు అతడిని మందలించగా, ఆ చిన్నారిపై పగ పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం బాలిక ఒంటరిగా కనిపించడంతో ఇదే అదనుగా భావించి పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తమ కుమార్తెను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఇంత చిన్న వయసులోనే పిల్లలు మాదకద్రవ్యాలకు బానిసలై, హత్యలు చేసే స్థాయికి వెళ్లడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
