Uttar Pradesh: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
పొగమంచు ఏడుగురి ప్రాణాలు తీసింది. వీరిలో అప్పుడే పెళ్లి చేసుకుని వస్తున్న జంట కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఈ ఉదయం జరిగిందీ విషాదం. పొగమంచు కమ్మేయడంతో బాధితులు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళ్తున్న టెంపో కనిపించకపోవడంతో దానిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కొత్త జంటకు నిన్న సాయంత్రమే ఝార్ఖండ్లో వివాహమైంది. అనంతరం వాహనంలో ధామ్పూర్లోని వరుడి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందు వెళ్తున్న టెంపోను బలంగా ఢీకొట్టడంతో వాహనాలు రెండూ పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి. ప్రమాద సమయంలో వధూవరులు, అత్తమామలు, వరుడి సోదరుడు సహా వాహనంలో 11 మంది ఉన్నారు. ప్రమాదంలో నవదంపతులతోపాటు వారి కుటుంబంలోని మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com