Vistara: విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా

టాటా గ్రూప్కు చెందిన విస్తారా ఎయిర్లైన్స్లో సంక్షోభం ముదురుతోంది. నిన్న వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దుచేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కిపైగా విమానాలను రద్దుచేసింది. విస్తారో దాదాపు 800 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో ఇటీవల 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని విస్తారా యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించింది. విస్తారా ఎయిర్ లైన్స్ లో నెలకొన్న పరిస్థితిని కేంద్ర పౌర విమానయానశాఖ కూడా పర్యవేక్షిస్తున్నది
టాటా సన్స్ అనుబంధ సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ను మరో అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియాలో విలీనం నేపథ్యంలో విస్తారా పైలట్లకు నూతన వేతన సవరణ కాంట్రాక్టుల్లో తేడాలు తలెత్తాయి. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు నిరసన బాట పట్టాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తాము పడిన ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరవు పెడుతున్నారు. దీంతో స్పందించిన కేంద్ర పౌర విమానయాన సంస్థ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు, విమాన సర్వీసులు జాప్యం, రద్దుకు సంబంధించిన సమాచారంతోపాటు, ఇతరత్రా వివరాలపై రోజువారీ నివేదికను సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విస్తారాను ఆదేశించింది.
ఎయిర్ ఇండియాలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న విస్తారా వేసవి నేపథ్యంలో రోజుకు 300కు పైగా విమానాలు నడుపుతున్నది. వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ సీనియర్ పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 మంది రాజీనామా చేయడంతో గందరగోళం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com