Home Minister Amit Shah : సింధు జలాల నిలుపుదలపై అమిత్ షా కీలక ప్రకటన

పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. సింధూ నది నుంచి ఒక్క చుక్క నీరు కూడా పాక్కు వెళ్లకుండా భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సింధూ నదీజలాలపై ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు.
జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం గురించి చర్చించారు. మూడు దశల్లో సింధూ జలాలు పాక్కు దక్కకుండా ప్లాన్ చేశారు. మొదట ప్రపంచ బ్యాంక్కు మన వైఖరి తెలియజేయాలని నిర్ణయించారు. సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ , పాకిస్థాన్ల మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. దీనికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సంతకం చేశారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రపంచ బ్యాంక్కు భారత్ వైఖరిని తెలియజేయాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com