Bengal Incident : బెంగాల్ ఘటన.. భయానకం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్ కతాలో జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని.. తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇటువంటి నేరాలపై యావత్ దేశం ఆగ్రహానికి గురవుతోందని, అందులో తాను కూడా ఉన్నానన్నారు. ఇప్పటివరకు జరిగింది చాలని.. మహిళలపై జరిగే నేరాలపై యావత్ దేశం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదన్నారు. పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక వ్యాసంలో బెంగాల్ ఘటనపై తొలిసారి స్పందించిన ద్రౌపదీ ముర్ము.. దేశంలో పలుచోట్ల మహిళలపై జరుగుతోన్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు కోల్కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు ఆందోళనలు చేస్తున్న సమయంలో దేశంలోని పలుప్రాంతాల్లో నేరస్థులు సంచరిస్తూనే ఉన్నారని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. బాధితుల్లో నాలుగైదేళ్ల చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇటీవల ఓ పాఠశాల విద్యార్థులు తనను కలిసినప్పుడు ‘ నిర్భయ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా హామీ ఇవ్వగలరా?’ అని చిన్నారులు తనను ప్రశ్నించారని గుర్తుచేశారు. నిర్భయ ఘటన తర్వాత దేశంలో లెక్కలేనన్ని విషాద ఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటిలో కొన్ని మాత్రమే దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయన్నారు. అనేక అత్యాచార ఘటనలను సమాజం మరిచిపోయిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com