Nishant Kumar : బిహార్లో నితీష్ రాజకీయ వారసుడు అరంగేట్రం!

బీహార్లో సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన జేడీ(యు)కి ఇప్పుడు భవిష్యత్ ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది. అధినాయకుడు నితీష్ కుమార్ ( Nitish Kumar ) వయోభారం, రాష్ట్రంలో పార్టీ ఇమేజీ క్రమంగా తగ్గుతుండటం జేడీయూ వర్గాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్తనాయకత్వం అవసరమనే వాదన కూడా వినిపిస్తోంది.
త్వరలో నితీష్ తనయుడు నిషాంత్ కుమార్ ( Nishant Kumar ) పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ (యునైటెడ్) మోడీ నేతృత్వంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కొంత కాలంగా ప్రాభవం కోల్పోతూ వస్తోంది.
ప్రశాంత్ కిషోర్తో సహా చాలా మంది జెడి(యు) క్షీణత గురించి ప్రస్తావించారు. ఆ పార్టీ అధినేత నితీష్ ఆరోగ్య పరిస్థితి సవాళ్లను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నిశాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం పార్టీ నాయకత్వ సంక్షోభానికి ఒక పరిష్కారంగా భావిస్తున్నారు. ఈ విషయం గురించి నిషాంత్ ను ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. సాదాసీదాగా కనిపించే నిషాంత్ కుమార్, గత వారం పాట్నాలో ఎలక్ట్రానిక్స్ స్టోర్ నుండి బయటికి వస్తున్నప్పుడు ఆయన్ను మీడియా ప్రశ్నించగా, రాజకీయ ప్రవేశం కేవలం వదంతులేనని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com