Pakistan : పాకిస్థాన్‌లో బాంబు దాడి..14 మంది సైనికులు మృతి

Pakistan : పాకిస్థాన్‌లో బాంబు దాడి..14 మంది సైనికులు మృతి
X

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న క్వెట్టా రైల్వే స్టేషన్‌పై శనివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది ఆర్మీ సైనికులు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్వెట్టా నుంచి గార్రిసన్ సిటీ రావల్పిండికి వెళ్లేందుకు ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాంబు పేలినట్టు సీనియర్ పోలీసు అధికారి మహ్మద్ బలోచ్ తెలిపారు. ప్రమాదం సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పెషావర్‌కు వెళ్లేందుకు ఓ రైలు సిద్ధంగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

దాడికి పాల్పడింది మేమే: బీఎల్ఏ

రైల్వే స్టేషన్ లో దాడికి పాల్పడింది తామేనని వేర్పాటు వాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తెలిపింది.స్టేషన్‌లోని పాక్ ఆర్మీ యూనిట్‌పై దాడి చేశామని పేర్కొంది. ప్రభుత్వం బలూచిస్థాన్ వనరులను దోపిడీ చేస్తోందని, ప్రావీన్స్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించింది.

Tags

Next Story