Regional Rural Banks : గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ షురూ!

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మరింత సమర్థంగా నిర్వహించడం, ఖర్చులను నియంత్రణ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కేంద్రం విలీనం చేయాలని చూస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రక్రియ జరగ్గా.. నాలుగో దఫా ఏకీకృత ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధమైంది. విలీన ప్రక్రియలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న 15 ఆర్ఆర్బీలు విలీనం కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 4, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్కు చెందిన 3, బిహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో రెండేసి ఆర్ఆర్బీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీన ప్రక్రియ అప్పులు, ఆస్తుల సర్దుబాటుకు లోబడి జరుగుతుంది. ఒకే రాష్ట్రం- ఒకే ఆర్ఆర్బీ వల్ల ఆయా బ్యాంకుల పనితీరు మెరుగవుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం నాబార్డ్తో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com