Corona Booster Dose: వారికి కూడా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలనుకుంటున్న కేంద్రం..

Corona Booster Dose: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసులు అందించాలని భావిస్తోంది మోదీ సర్కారు. ఇప్పటికే వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి ప్రికాషనరీ డోసుల పేరుతో మూడో డోసును కేంద్రం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం చైనా సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసును అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం ఇదివరకు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 10న అర్హులైన వారికి బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికీ వరకు 2 కోట్ల ప్రికాషనరీ డోసులను పంపిణీ చేసింది.మరోవైపు 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని మొదలుపెట్టింది కేంద్రం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com