Chandipura Virus : చాందీపురా వైరస్ తో 28 మంది చిన్నారులు మృతి

చాందీపురా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 28 మంది చిన్నారులు మృతి చెందినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రిశికేశ్ పటేల్ వెల్లడించారు. తమ రాష్ట్రంలో జులైలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారంతా 14 ఏళ్ల లోపు చిన్నారులేనని తెలిపారు. బుధవారం గుజరాత్ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యే ఉమేశ్ మక్వానా అడిగిన ప్రశ్నకు మంత్రి రిశికేశ్ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తంగా 164 మెదడువాపు కేసులు గుర్తించగా.. ఇవన్నీ చాందీపుర వైరస్తో పాటు మరికొన్ని వ్యాధికారక వైరస్ల వల్ల సంభవించినవేనన్నారు. వీటిలో 61 కేసులు చాందీపురా వైరస్ వల్లే వచ్చాయన్నారు. మెదడువాపు సంబంధిత వైరస్ వల్ల ఇప్పటివరకు 101 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. అంతా 14 ఏళ్ల లోపువారేన్నారు. వీరిలో 28మంది ఈ వైరస్ సోకి మృతి చెందినట్లు గుర్తించామని.. మిగతావారి మరణానికి మెదడువాపు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లే కారణమన్నారు. చాందీపురా వైరస్ సోకినవారిలో 63 మంది చిన్నారులు డిశ్చార్జి అయినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com