TDP-NDA Alliance : అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్

TDP-NDA Alliance : అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఎన్డీఏలో టీడీపీ రీఎంట్రీ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో..... చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా సీట్లు సాధించాలని.. లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశాన్ని తిరిగి ఎన్డీయేలో చేర్చుకొనే అంశంపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిహార్‌లో నీతీష్‌కుమార్,ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌చౌధరిని ఎన్డీయేలో చేర్చుకున్న భాజపా అగ్రనేతలు.. రేపోమాపో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీనీ చేర్చుకోవడానికి.. రంగం సిద్ధం చేశారు. అదే క్రమంలో తెలుగుదేశంతోజట్టు కట్టేందుకు సమాయత్తమయ్యారు. గురువారం రాత్రి పదిన్నర నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్‌లతో అమిత్‌షా, నడ్డా చర్చించినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేశారు. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో భాజపాకు కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది. భాజపాకు 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని తెలుగుదేశం యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకుమించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మరో దఫా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత నెల 7న అమిత్‌షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు ఒక దఫా చర్చలు జరిపారు. తాజాగా మరోమారు చర్చల కోసం ఆయన హైదరాబాద్‌ నుంచి గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి అమిత్‌షా నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. 2014 ఎన్నికల్లోభాజపాకు తెలుగుదేశం 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కూటమిలో జనసేన ఉండటం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున భాజపా అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యంకాదనే వాదన తెలుగుదేశం వైపునుంచి వినిపిస్తోంది. మొత్తంగా భాజపా, జనసేనకు కలిపి 7 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని, చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై భాజపా అగ్రనేతలే చర్చలు జరుపుతున్నందున..ఆ పార్టీలోని రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ స్పందించడంలేదు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి దిల్లీ వచ్చిన చంద్రబాబును ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు కలిసిమాట్లాడారు.

Tags

Read MoreRead Less
Next Story