Chhattisgarh: ఛత్తీస్గఢ్, మిజోరంలలో కొనసాగుతున్న పోలింగ్..

ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. 90 స్థానాల ఛత్తీ్సగఢ్ అసెంబ్లీలో తొలుత 20 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 12 ఎస్టీ స్థానాలు, ఒక ఎస్సీ స్థానం ఉన్నాయి. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ఎస్టీ స్థానాలైన మొహలా-మాన్పూర్, అంతగఢ్, భానుప్రతా్పపూర్, కాంకేర్, కేశ్కాల్, కొండగావ్, నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కోంటా సీట్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. బస్తర్ డివిజన్లోని 12 స్థానాల్లో పోలింగ్ సజావుగా జరగడం కోసం 60 వేల మంది భద్రతాసిబ్బందిని మోహరించారు. మొత్తం 25,249 మంది పోలింగ్ సిబ్బంది ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు తొలి దశ బరిలో నిలిచారు. 40,78,681 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. బరిలో నిలిచిన ప్రముఖుల్లో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం రమణ్సింగ్ (రాజ్నంద్గావ్), పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకూట్) తదితరులున్నారు. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద సంఖ్యలో పోలీసు, ప్రత్యేక బలగాలను మోహరించింది. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు.
మిజోరాంలోని మొత్తం 40 స్థానాలకు మంగళవారమే ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జడ్పీఎం), కాంగ్రెస్ నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. 18 మంది మహిళలు సహా 174 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 8,51,895 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్ర సరిహద్దులను బంద్ చేశారు. గత ఎన్నికల్లో ఎంఎన్ఎ్ఫకు 27 స్థానాలు, జడ్పీఎంకు 7, కాంగ్రె్సకు 5, బీజేపీకి ఒక్క స్థానం దక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com