Uttar Pradesh: భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన కంటైనర్.. 8 మంది మృతి ..43 మందికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా రాఫత్పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులు ఒక ట్రాక్టర్ ట్రాలీలో రాజస్థాన్లోని జహర్పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో వీరి వాహనం బులంద్శహర్-అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి-34పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్కు వీరి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీ సహా స్థానిక పోలీసు, పరిపాలన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు రూరల్ ఎస్ఎస్పీ దినేశ్ కుమార్ సింగ్ తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని ఆయన వివరించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్ను రహదారిపై నుంచి తొలగించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com