Corona India: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు..
Corona India: దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 2 వేల 451 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4 కోట్ల 30 లక్షల 50 వేలు దాటింది.
మరణాల సంఖ్య 5 లక్షల 22 వేలకు పైగా ఉంది. దేశంలో ప్రస్తుతం 14 వేల 241 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. ఢిల్లీలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. గత మూడు రోజుల వ్యవధిలో దేశ రాజధానిలో వెయ్యి కేసులు నమోదవడం ఇది రెండో సారి. వైరస్ కారణంగా ఢిల్లీలో కొత్తగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేల 253కు పెరిగింది. ఐఐటీ మద్రాస్లో మరో 18 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం క్యాంపస్లో వైరస్ బాధితుల సంఖ్య 30కి పెరిగింది. ఏప్రిల్ 19న ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో మొదటి కరోనా కేసు బయటపడింది. మరోవైపు 18 నుంచి 59 ఏళ్ల మధ్య వారికి ప్రికాషనరీ డోసు ఫ్రీగా అందించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com