Panjilal Meher: పెళ్లి గిప్ట్ రూపంలో పార్శిల్ బాంబు..

పెళ్లి కానుకగా పార్సిల్ బాంబు ఇచ్చి వరుడితో పాటు మరో వృద్ధురాలు మృతికి కారణమైన ఓ అధ్యాపకుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒడిశా రాష్ట్రంలోని బొలాంగిర్ జిల్లాలో 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బుధవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.. భైన్సాలోని జ్యోతి వికాస్ కళాశాలలో పంజీలాల్ మెహర్ అనే వ్యక్తి అధ్యాపకుడుగా విధులు నిర్వహించేవాడు. ఇదే కళాశాలలో మహిళా ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సంయుక్త సాహుతో పంజీలాల్ మెహర్కు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సంయుక్త సాహు కుమారుడి వివాహాన్ని ఆసరాగా చేసుకుని వరుడిని హతమార్చాలని పంజీలాల్ నిర్ణయించుకున్నాడు.
దీనిలో భాగంగా వివాహ కానుకగా పార్సిల్ బాంబును పంజీలాల్ మెహర్ పంపించాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయగానే బాంబు పేలి సంయుక్త సాహు కుమారుడు సౌమ్య సాహు మృతి చెందాడు. అతనితో పాటు పక్కనే ఉన్న నానమ్మ కూడా మృతి చెందింది. పెళ్లి కూతురు తీవ్ర గాయాలతో బయటపడింది.
2018 ఫిబ్రవరి 23న ఈ ఘటన జరగ్గా, అదే ఏడాది మార్చి 23న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఏప్రిల్ నెలలో పంజీలాల్ మెహర్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను ప్రతాప్గఢ్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు. ఈ కేసును విచారించిన ప్రతాప్గఢ్ అదనపు జిల్లా జడ్జి, నిందితుడు పంజీలాల్ మెహర్ను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1.70 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com