Madhyapradesh: పెళ్లయిన 36 రోజులకే భర్తకు విషంపెట్టి చంపిన భార్య

Madhyapradesh: పెళ్లయిన 36 రోజులకే భర్తకు విషంపెట్టి చంపిన భార్య
X
ఇది కూడా రాజా రఘువంశీ తరహా విషాదాంతమే!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ కు చెందిన రాజా రఘువంశీ ని పెళ్లయిన 13 రోజులకే ఆయన భార్య సోనమ్‌ రఘువంశీ హత్య చేయించిన ఘటనను మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తకు భార్య విషంపెట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌ రాష్ట్రం గర్హ్వా జిల్లా లో గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రామ్‌చంద్రాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విష్ణుపూర్‌ గ్రామానికి చెందిన రఘునాథ్‌ సింగ్‌ కుమార్తె సునీతను.. మే 11న జార్ఖండ్‌ రాష్ట్రం గర్హ్వా జిల్లాలోని బహోకుందర్‌ గ్రామానికి చెందిన బుధ్‌నాథ్‌ సింగ్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహం జరిగిన మరుసటి రోజే సునీత తనకు భర్త ఇష్టంలేదని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది.

దాంతో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేసి, సునీతకు నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. దాంతో శనివారం భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లిన సునీత కూరగాయ చెట్లకు కొట్టాలనే సాకుతో పురుగులమందు కొనించింది. ఆదివారం రాత్రి దాన్ని భర్త తినే భోజనంలో కలిపి పెట్టింది. రాత్రి భోజనం తర్వాత నిద్రపోయిన బుధ్‌నాథ్‌ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.

కొడుకు మృతితో బుధ్‌నాథ్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోడలే కొడుకు తినే భోజనంలో విషం కలిపిందని ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీతను అదుపులోకి తీసుకున్నారు. బుధ్‌నాథ్‌ పోస్టుమార్టం నివేదిక వస్తే అతడి మరణానికి విషమే కారణమా.. లేదా.. అనే తేలుతుందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story