Farmers : మెగా మార్చ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం

Farmers : మెగా మార్చ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు ఢిల్లీ అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు డ్రోన్లతో సహా పలు రౌండ్ల టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి ఘగ్గర్ నది వంతెనపై నుంచి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించినప్పుడు పోలీసులు మొదట బాష్పవాయువు ప్రయోగించారు.

కొందరు రైతులు కూడా ట్రాక్టర్ల సాయంతో సిమెంటు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. బారికేడ్‌లకు దూరంగా ఉండాలని హర్యానా పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ, చాలా మంది నిరసనకారులు బారికేడ్‌ల మీదుగా వెళ్లారని అధికారులు తెలిపారు. అయితే ఒక గంట తర్వాత శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్ల దగ్గర భారీ సంఖ్యలో రైతులు గుమిగూడడంతో, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మళ్లీ టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారని వారు తెలిపారు. కొంతమంది నిరసనకారులు సమీపంలోని పొలంలోకి ప్రవేశించడంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించారు.

టియర్ గ్యాస్ షెల్స్ వేయడానికి, నిరసనకారులపై నిఘా ఉంచడానికి డ్రోన్ కూడా ఉపయోగించారు. టియర్‌గ్యాస్ షెల్‌ల నుండి వెలువడే పొగ ప్రభావం నుండి తమను తాము రక్షించుకోవడానికి రైతులు తడి జనపనార సంచులను మోసుకెళ్లడం ఓ వీడియోలో కనిపించింది. తమ డిమాండ్లపై ఇద్దరు కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశం అసంపూర్తిగా ఉండడంతో కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తున్నారు. తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీకి వెళతారని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story