Donald Trump: భారత్ పై మరోసారి ప్రేమ కురిపించిన ట్రంప్.. భారత్ ప్రజలకు ట్రంప్ స్పెషల్ మెసేజ్!

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారత్, భారత ప్రజల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ, త్వరలోనే దేశంలో పర్యటించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఇవాళ జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2026 సదస్సులో ట్రంప్ పంపిన ఈ సందేశాన్ని అమెరికాకు చెందిన మితవాద కార్యకర్త, ట్రంప్ విధేయురాలు లారా లూమర్ చదివి వినిపించారు.
ఈ సదస్సులో పాల్గొన్న లారా లూమర్, తాను వేదికపైకి రావడానికి సుమారు గంట ముందు అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని సభికులకు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ చెప్పిన మాటలను ఆమె యథాతథంగా వివరించారు. "నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. నేను మోదీని ఎంతగానో ఇష్టపడతానని దయచేసి వారికి తెలియజేయండి. ప్రధాని మోదీ ఒక అద్భుతమైన నాయకుడు, నా మంచి స్నేహితుడు. త్వరలోనే మరో పర్యటన కోసం నేను కచ్చితంగా భారత్కు వస్తానని భారత ప్రజలకు చెప్పండి" అని ట్రంప్ తనతో అన్నట్లు లూమర్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ రాజకీయాలపై చర్చ జరుగుతున్న ఈ సదస్సులో లూమర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ట్రంప్, మోదీ మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని ఈ సందేశం మరోసారి స్పష్టం చేసింది.
గతంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహం ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2020లో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల మధ్య నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమం వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇరువురు నేతలు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
