Darbar Move : దర్బార్ మూవ్‌ను పునరుద్ధరిస్తాం.. ఫరూక్ చరిత్రాత్మక హామీ

Darbar Move : దర్బార్ మూవ్‌ను పునరుద్ధరిస్తాం.. ఫరూక్ చరిత్రాత్మక హామీ
X

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను అధికారంలోకి తీసుకు వస్తే చారిత్రక 'దర్బార్ మూవ్ ' ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. జమ్మూ, కశ్మీర్ మధ్య ఐక్యతను పాదుకొలిపేందుకు ఈ చర్య దోహద పడుతుందని చెప్పారు, జమ్ము, కశ్మీర్ ను రాజకీయంగా, ఆర్ధికంగా, భావోద్వేగాల పరంగా అనుసంధానించే వారధి దర్బార్ ' మూవ్' అని గుర్తు చేశారు. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి విభజన ఉండదని, అది ఎంతమాత్రం సరి కాదని ఫరూక్ అన్నారు.

ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా అనుసరిస్తున్న 'దర్బార్ మూవ్' ప్రక్రియను పునరుద్ధరిస్తామని వాగ్ధానం చేశారు. దీనికి 152 ఏళ్ల చరిత్ర ఉంది. మహారాజా రణ్ బీర్ సింగ్ పాలనలో 1872లో ఈ దర్బార్ మూవ్ ను ప్రారంభించారు. ఆ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమ్మర్ రాజధాని శ్రీనగర్ కు షిఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత ఆరు నెలలు వింటర్ క్యాపిటల్ జమ్మూకు షిఫ్ట్ అవుతాయి. మే నుంచి అక్టోబర్ వరకూ సమ్మర్ సీజన్లో లో ప్రభుత్వ అధికా అంతా శ్రీనగర్ నుంచి పనిచేస్తారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ వింటర్ లో జమ్ము నుంచి పనిచేస్తుంటారు. రెండు ప్రాంతాల (జమ్ము, కశ్మీర్) మధ్య సమదృష్టితో వ్యవహరించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదం చేసేదనే అభి ప్రాయం బలంగా ఉంది.

నిజానికి దర్భార్ మూవ్ విషయంపై ఎలాంటి వివాదం లేనప్పటికీ ఈ చర్య వల్ల రాష్ట్ర ఖజానాకు భారం ఎక్కువవుతోందనే వాదన మాత్రం ఉంది. ప్రభుత్వ ఆఫీసులు, రికార్డులు, సిబ్బందిని తరలించడం వల్ల ఏటా వందల కోట్లు ఖర్చవుతోందని పలువురి వాదన, కోవిడ్ మహమ్మారి సమయంలో ఖర్చు విషయంలో ఈ ఆందోళనలు మరింత పెరగడంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విధానాన్ని 2021 జూన్ 30న సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ అంశం ఈ ప్రాంతంలో రాజకీయంగా, సాంస్కృతిక పరంగా కీలకాంశంగానే కొనసాగుతోంది. సమ్మిళత వృద్ధి, ప్రాంతీయ సామరస్యతకు ఈ చర్య కీలకమనే అభిప్రాయం బలంగానే ఉంది.

Tags

Next Story