NASA Space Mission : శుభాంశు అంతరిక్ష యాత్ర.. రేపు సాయంత్రం 5.52 గంటలకు యాత్ర

NASA Space Mission : శుభాంశు అంతరిక్ష యాత్ర.. రేపు సాయంత్రం 5.52 గంటలకు యాత్ర
X

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణానికి కౌంట్ డౌన్ మొదలైంది. అంతరిక్షంలోకి చారిత్రాత్మక పునరాగమనం చేయడానికి భారత్ సిద్ధమైంది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్లో భాగంగా జూన్ 10న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానున్నారు. ఈ మేరకు యాక్సియం స్పేస్, నాసా ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. 1994లో రాకేశ్ శర్మ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత తొలి వ్యోమగామిగా నిలువగా.. శుభాంశుశుక్లా రెండో వ్యోమగామిగా అంతరిక్ష ప్రయోగాల చరిత్ర పుటలకెక్కనున్నారు. ప్రస్తుత మిషన్కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరించే శుభాంశు శుక్లా.. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి మంగళవారం నాడు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.52 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ బయలుదేరనున్నారు. వీరు 28 గంటల్లో అంతరిక్ష కేంద్రంతో డాక్ చేయబడనున్నారు. వాస్తవానికి ఈ మిషన్ ను మే 29వ తేదీకే షెడ్యూల్ చేయగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో వచ్చే ప్రయోగాన్ని జూన్ 10కి మార్చారు.

ఈ యాత్రలో శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా వెళ్లనున్నారు. శుభాంశు శుక్లా తన వెంట మూంగ్ దాల్ హల్వా, గజర్ కా హల్వా, ఆమ్రాస్, బియ్యం వంటి ఆహారపదార్థాలు తీసుకెళ్తున్నట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. తాజాగా శుభాంశు శుక్లా పాల్గొంటున్న ఈ మిషను అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా చేపడుతున్నాయి. రోదసిలో శుభాంశు శుక్లా 7 ప్రయోగాల్లో పాల్గొంటారు. అంతరిక్షంలో పంటల సాగు, టార్డిగ్రేడ్ (నీటి ఎలుగుబంటి)ల గురించి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ ఆహారంతో ముడిపడిన పంటలపై ప్రయోగాలను చేపట్టడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది. మెంతి, పెసర మొలకలపై పరిశీలన వంటివి ఇందులో ఉన్నా. యి. వాటిని భూమికి తీసుకొచ్చి.. నేలపై ఎలా ఎదుగు తా యన్నది పరిశీలిస్తారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించిన 39 ఏళ్ల శుభాంశు శుక్లా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా విధుల్లో చేరి వ్యోమగామి స్థాయికి ఎదిగారు.

Tags

Next Story