D.Gukesh: చెస్ బోర్డును మోదీకి గిఫ్ట్ చేసిన చెస్ ఛాంపియన్ గుకేశ్ !

తెలుగు మూలాలున్న చెన్నై చెస్ ప్లేయర్ డి.గుకేశ్ ఇటీవల వరల్డ్ చాంపియన్ షిప్ గెలుచుకోవడం తెలిసిందే. సింగపూర్ లో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్లో డింగ్ లిరెన్ పై గుకేశ్ సాధించిన అద్భుత విజయంతో యావత్ భారతదేశం పులకించిపోయింది. 18 ఏళ్ల వయసుకే గుకేశ్ సాధించిన ఘనత చెస్ పండితులను సైతం సమ్మోహితులను చేసింది.
కాగా, గుకేశ్ నేడు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశాడు. తాను వరల్డ్ టైటిల్ గెలుచుకునే క్రమంలో ఫైనల్లో ఆడిన చెస్ బోర్డును ప్రధానికి కానుకగా ఇచ్చాడు. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.
"గుకేశ్ తో సంభాషణ అద్భుతంగా సాగింది. ఇవాళే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు అతడితో మాట్లాడాను. అయితే అతడిలో నాకు బాగా నచ్చే అంశాలు అతడి దృఢసంకల్పం, అంకితభావం. అతడి ఆత్మవిశ్వాసం నిజంగా స్ఫూర్తిదాయకం. కొన్నేళ్ల కిందటి ఓ వీడియోలో గుకేశ్ ఏం చెప్పాడో నాకు గుర్తుంది. తాను చిన్న వయసులోనే వరల్డ్ చాంపియన్ అవుతానని చెప్పాడు. తన స్వయంకృషితో దాన్ని సాధ్యం చేసి చూపించాడు.
ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, అతడిలో వినయం, సంయమనం కూడా చూడొచ్చు. ప్రపంచ విజేతగా నిలిచిన సమయంలోనూ అతడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com