India S-400 Missiles : చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ క్షిపణుల మోహరింపు

భారత వైమానిక దళం సరిహద్దుల్లో క్షిపణులను మోహరించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం వైమానిక దళం అప్రమత్తమైంది. చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా మూడు ఎస్-400 క్షిపణులను మోహరించింది. మరో రెండు క్షిపణులను మోహరించడం గురించి చర్చించడానికి భారత్,రష్యా అధికారులు త్వరలో సమావేశం కానున్నారు.
ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ , చైనాలు మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి. ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ పాక్, సైన్యాన్ని మోహరిస్తూ చైనా.. సరిహద్దుల్లో అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాయి. అయితే ప్రతిగా భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికను సమకూర్చుకుంటూ సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది. ఈ రెండు కీచక దేశాల నుంచి ముప్పు పొంచిఉండటంతో అత్యాధునిక ఆయుధాలను భారత్ తరలిస్తున్నది. ఇందులోభాగంగా భారత వాయుసేన తాజాగా చైనా, పాక్ సరిహద్దుల్లో శత్రు క్షిపణుల అంతుతేల్చే మూడు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ స్క్వాడ్రన్లను మోహరించింది.
ఇవి గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలుగుతాయి. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఈ క్షిపణి వ్యవస్థ అండగా నిలుస్తుంది. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేస్తుంది. ఏకకాలంలో 36 లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం.
రష్యా నుంచి ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు 2018-19వ సంవత్సరంలో భారతదేశం 35వేల కోట్లరూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా క్షిపణుల కొనుగోలుకు ఆటంకం కలిగింది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో మరో రెండు క్షిపణులను మోహరించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు నిర్ణయించాయి. భారతదేశం లాంగ్ రేంజ్ సర్పేస్ ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ను కొనుగోలుకు ఇటీవల భారత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మూడు-లేయర్డ్ లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ 400 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులను కూల్చివేయగలదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com