Covid Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్..

Covid Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్..
కేరళలోనే అత్యధిక కేసులు నమోదు

ఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కవ భాగం కేరళలో వెలుగుచూశాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో ఓ మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలంతా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

2019 లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం దాదాపు 2, 3 ఏళ్ల పాటు తీవ్రంగా వణికించింది. అయితే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి అక్కడక్కడా తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నా.. ప్రస్తుతం కరోనా మహమ్మారి మాత్రం దాదాపుగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో ఒక్కసారిగా రోజు వారీ కొవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడం కొత్త భయాలను రేకెత్తిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే దేశంలో 166 మంది కొత్తగా కొవిడ్ బారిన పడినట్లు వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం మరింత తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.

ఇటీవల కరోనా సోకి శిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు ఈ ఏడాది జూలైలో నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. 2023 జూలై 24 వ తేదీన దేశంలో కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే నమోదైనట్లు చెప్పారు. ఇక ఒక్కసారిగా రోజువారీ కరోనా కేసుల్లో భారీ పెరుగుదల రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైరస్ సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

మన దేశంలో 2020 జనవరి 7 వ తేదీన తొలి కరోనా కేసు కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. కేరళలోని త్రిస్సూర్‌ జనరల్‌ ఆస్పత్రిలో 20 ఏళ్ల మహిళకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో.. ఆమె రక్తనమూనాలు తీసుకుని ల్యాబ్‌లో పరీక్షించగా.. కరోనా సోకినట్లు ప్రకటించారు. అప్పటికే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించింది.

Tags

Read MoreRead Less
Next Story