IndiGo Crisis : 3,000 ఫ్లైట్లు రద్దు తర్వాత ఇండిగోపై ప్రభుత్వం ఆగ్రహం..కఠిన చర్యలకు డీజీసీఏ నోటీస్.

IndiGo Crisis : గత కొద్ది రోజులుగా దేశంలోని విమానాశ్రయాలలో నెలకొన్న గందరగోళం అందరికీ తెలిసిందే. చెక్-ఇన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు, కోపంతో అరుస్తున్న ప్రయాణికులు, తమ విమానం గురించి సమాచారం లేని నిస్సహాయత... ఇవన్నీ సాధారణ దృశ్యాలుగా మారిపోయాయి. దాదాపు 66% మార్కెట్ వాటా కలిగి ఉన్న దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో, ఒక పెద్ద సంక్షోభంతో పోరాడుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. ప్రయాణికుల కష్టాలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్లో స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. విమానయాన సంస్థ ఎంత పెద్దదైనా సరే, తన పేలవమైన ప్రణాళిక లేదా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రయాణికులకు సమస్యలు సృష్టించడానికి అనుమతించబడదని ఆయన లోక్సభలో హెచ్చరించారు. ఇండిగో ఇటీవలి సంక్షోభం తర్వాత బాధ్యతను నిర్ణయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు ప్యాసింజర్ ఫస్ట్ అనే విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోకు నోటీస్ జారీ చేసింది. మొత్తం రంగానికి ఒక ఉదాహరణగా ఉండేలా.. విమానయాన నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి గత వారం ఇండిగో దాదాపు 3,000 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే 1,000 కంటే ఎక్కువ ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇది ఇండిగో సాధారణ రోజువారీ విమానాల్లో దాదాపు సగం.
డీజీసీఏ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను కూడా ఈ సమస్యకు ప్రత్యక్షంగా బాధ్యుడిని చేసింది. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించడంలో సీఈఓ ఫెయిల్ అయ్యారని రెగ్యులేటర్ పేర్కొంది. నోటీస్కు సమాధానం ఇవ్వడానికి ఇండిగోకు 15 రోజుల సమయం ఇచ్చారు. పైలట్ల కొరత, వారి విశ్రాంతికి సంబంధించిన కొత్త నిబంధనలు ఈ మొత్తం సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నవంబర్ 1 నుంచి పైలట్ల డ్యూటీ, రెస్ట్ పీరియడ్పై కొత్త మార్గదర్శకాలు అమలులోకి రావడంతో ఎయిర్లైన్ రోస్టర్ సిస్టమ్లో గందరగోళం ఏర్పడింది. అయితే ఈ మార్పులకు సిద్ధం కావడానికి ఇండిగోకు తగినంత సమయం ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి డీజీసీఏ ఇండిగోను తన ప్రణాళికాబద్ధమైన విమానాలలో 5% కోత విధించాలని ఆదేశించింది. కొత్త షెడ్యూల్ను బుధవారం లోపు సమర్పించాలని కోరింది. ఫ్లైట్ రద్దులు, రిఫండ్లు, విధించే అవకాశం ఉన్న జరిమానాల కారణంగా ఇండిగోకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్, జెఫరీస్ వంటి ఆర్థిక సంస్థలు హెచ్చరించాయి. దీనితో పాటు బ్రాండ్ ప్రతిష్టకు కూడా తీవ్ర భంగం కలిగింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

