UN-India: ఒకరిని జైల్లో పెట్టారు.. ఇంకొకరిని అందలం ఎక్కించారు పాక్పై భారత్ ధ్వజం

ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్థాన్పై భారత్ ధ్వజమెత్తింది. ‘‘శాంతి కోసం నాయకత్వం’’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అనవసరం విషయాలు ప్రస్తావించింది. జమ్మూ కాశ్మీర్, సింధు జలాలపై నోరుపారేసుకుంది. దీన్ని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని తిప్పికొట్టారు.
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం అని.. విడదీయరాని భాగం అని మరోసారి స్పష్టం చేశారు. ‘‘అవి ఉన్నాయి… ఉంటాయి.. ఎల్లప్పుడూ ఉంటాయి.’’ అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారని.. అసిమ్ మునీర్ను మాత్రం అందలం ఎక్కించారని.. జీవితాంతం రోరనిరోధక శక్తిగా పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించారు.
సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎందుకు రద్దు చేసిందో వివరిస్తూ … పాకిస్థాన్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా మారిందని అభివర్ణించారు. 65 సంవత్సరాల క్రితం భారతదేశం మంచి విశ్వాసంతో, మంచి సంకల్పం, స్నేహ స్ఫూర్తితో సింధు జలాల ఒప్పందంలోకి ప్రవేశించిందన్నారు. కానీ ఈ ఆరున్నర దశాబ్దాల్లో భారతదేశంపై పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రవాద దాడులను ప్రేరేపించి ఒప్పందం యొక్క స్ఫూర్తిని ఉల్లంఘించిందని పర్వతనేని ధ్వజమెత్తారు. గత నాలుగు దశాబ్దాల్లో పాకిస్థాన్ స్పాన్సర్ చేసిన ఉగ్ర దాడులతో 10 వేల మంది భారతీయులు చనిపోయారని.. గత ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్ర దాడిలో ఒక విదేశీయుడు సహా 26 మంది చనిపోయారని గుర్తుచేశారు. అందుకే సింధు జలాలు ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ముగించేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
అంతకముందు పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని విమర్శించాడు. జమ్మూ కాశ్మీర్లో పరిష్కరించబడని వివాదం ఉందంటూ వ్యాఖ్యానించాడు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాన్ని పాకిస్థాన్ కోరుకుంటుందని.. కానీ శాంతి ఏకపక్షంగా సాధించకూడదని జమ్మూ కాశ్మీర్ను ప్రస్తావిస్తూ అహ్మద్ అన్నాడు. సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఏకపక్షంగా నిలిపివేయడాన్ని అంతర్జాతీయ బాధ్యతలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలిపాడు. పాకిస్థాన్ విమర్శలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

