Lalit Modi : విజయ్ మాల్యా పార్టీలో వ్యాఖ్యలు .. క్షమాపణలు చెప్పిన లలిత్ మోదీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ లలిత్ మోదీ బ్రిటన్కు పారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన విజయ్ మాల్యాతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. "మేం అతిపెద్ద పలాయనవాదులం" అని వారు పేర్కొన్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఆ వ్యాఖ్యలు భారతదేశాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉన్నాయని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లలిత్ మోదీ, విజయ్ మాల్యా దేశాన్ని మోసం చేసి పారిపోవడమే కాకుండా, విదేశాల్లో భారత్ను బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడితున్నారు. నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో లలిత్ మోదీ క్షమాపణలు చెప్పారు.
తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని లలిత్ మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తనకు భారత ప్రభుత్వం అంటే గౌరవం ఉందని తెలిపారు. ఇటీవల విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు వేడుకకు లలిత్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు కలిసి ఉన్న వీడియో వైరల్ అయింది.
విజయ్ మాల్యా పుట్టినరోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలు పలువురు హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియోని లలిత్ మోదీ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు. అందులో మేం ఇద్దరం పరారీలో ఉన్న అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ వ్యాఖ్యానించారు. కానీ విజయ్ మాల్యా మాత్రం ఆ వీడియోలో ఎటువంటి కామెంట్ చేయలేదు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు లలిత్ మోదీ వైఖరిని తప్పుపట్టారు. పరారీలో ఉన్న లలిత్ మోదీని కర్మ వెంటాడుతుందని, ఇవాళ కాకపోతే, రేపైనా అని కొందరన్నారు. భారతీయ చట్టాలను కించపరిచే రీతిలో లలిత్ మోదీ వ్యాఖ్యలు చేసినట్లు ఓ యూజర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సైలెంట్గా ఉంటే బలమైన వాళ్లు దేశాన్ని లూటీ చేసుకోవచ్చు అన్న సందేశం వస్తుందని కొందరన్నారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో లలిత్ మోదీ తాజాగా క్షమాపణలు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

